Tuesday, 21 March 2017

ఆహార వేటలో సాగే దోమకు మనిషిని గుర్తించేందుకు మూడు రకాల గ్రాహకాలు తోడ్పడతాయని శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడైంది. దృశ్య పరమైన గ్రాహకంతో పాటు వాసనను గ్రహించడం, శరీరం నుంచి వెలువడే వేడి ద్వారా మనిషిని గుర్తించి తీరిగ్గా రక్తాన్ని జుర్రుకుంటుందని పరిశోధకులు చెబుతున్నారు. వీటి బారినుంచి తప్పించుకోవడం అంత తేలిక కాదని తెలిసిందే అయినా మార్కెట్లో లభించే రకరకాల రిపెల్లెంట్‌లు ఉపయోగిస్తుంటాం. అయితే దోమల ముందు వీటి పప్పులేం ఉడకవట. మహా అయితే కాసేపు దూరం పెట్టగలవేమో కానీ వాటిని పూర్తిగా అడ్డుకోవడం ఈ రిపెల్లెంట్‌ల వల్ల కాదని శాస్త్రవేత్తలు వివరించారు. పిల్లల ఆకలిని తీర్చేందుకు ఆహారాన్ని(రక్తాన్ని) వెతుకుతూ బయలుదేరిన ఆడదోమ మనిషిని అల్లంత దూరం నుంచే గుర్తిస్తుందని చెప్పారు. ‘మనిషితో పాటు ఇతర ప్రాణులు వదిలే శ్వాసను, అందులోని కార్బన్‌ డయాక్సైడ్‌ను సుమారు 50 మీటర్ల దూరం నుంచే గుర్తించి అటుగా ఎగురుతుంది. అలా 15 మీటర్ల దూరంలోకి రాగానే తన కళ్లకు పనిచెబుతుంది. దీంతో దోమ పదిహేను మీటర్ల దూరం వరకు చూడగలదని తేలిపోయింది. ఆపై మనిషి సమీపంలోకి అంటే దాదాపు మీటరు దూరంలోకి వచ్చాక టార్గెట్‌ శరీరం నుంచి వెలువడే ఉష్ణోగ్రతను గుర్తించి ముందుకు సాగుతుంది’ అని కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ప్రొఫెసర్‌ మైకెల్‌ డికిన్సన్‌ వివరించారు. ఆహార వేటలో దోమకు తోడ్పడే అంశాలేమిటనే దిశగా తాము నిర్వహించిన ప్రయోగంలో ఈ విషయాలు వెల్లడయ్యాయని వివరించారు. ఇందుకోసంవీడియో కెమెరాలతో పాటు త్రీడీ ట్రాకింగ్‌ సాఫ్ట్‌వేర్‌ సాయంతో దోమలను పరీక్షించినట్లు మైకెల్‌ తెలిపారు.

No comments: